Thursday 19 February 2015

చిన్న విన్నపం

ప్రియమైన దేముడా,
ఎందుకయ్యా మా తెలుగు చిత్ర పరిశ్రమ మీద పగబట్టావు? రంభ ఊర్వశి ల వినోదం విసుగు తెప్పించిందా? తెలుగు గడ్డమీద వినోదం తో ఈర్ష్య కలిగిందా?  మొన్న వరుస పెట్టి కొంత మంది హాస్య నటులని, కారక్టర్ నటులని తీసుకువెళ్లావు. దర్శక రత్నాలు బాపు, బాలచందర్ లని కొంప మునిగినట్టు తీసుకుపోయావు. ఒకరి శోకం నుండి బయట పడే లోపు ఇంకొకళ్లని నీ దగ్గరకు తీసుకు పోతున్నావు. ఏదో నీకు వినోదం తక్కువ అయి మా హాస్య నటులని తీసుకెళ్తున్నావనుకున్నాం. మొన్న జగపతి రాజేంద్రుణ్ణి  ఈ రోజు తెలుగు సినిమాకి రాజైన రామానాయుడిని. బహుశా మీ టీం కి క్రమశిక్షణ, నిబద్ధత మొదలైన అంశాలు కూడా కరువైనట్టున్నాయి. శిక్షణ శిబిరం లాంటివి మొదలు పెట్టలేదు కదా.
తెలుగు వాడికి సినిమా ఒక వినోదం మాత్రమే కాదు, జీవితం లో ఒక భాగం. తెలుగు ప్రజలు సినీ రంగం వారిని అభిమానించినట్టు మారేరాష్ట్రం లోనూ కనపడదు. రామానాయుడు అంతిమ యాత్రకి వచ్చిన వారిని చూసిన తరువాత  నీ తప్పు నీకు తెలిసి ఉంటుంది. ఆ ధన్యజీవి లోని క్రమశిక్షణ, శ్రమించే గుణం, మానవత్వం, దయాగుణం లాంటివి అన్నీ ఆయన బిడ్డలు, మనుమలు, ఆయన దగ్గర శిష్యరికం చేసిన ప్రతివారూ నేర్చుకున్నారులే. కష్టపడే గుణం, క్రమశిక్షణ ఉన్నవాళ్లకి అదృష్టం ఆ రెండిటి మధ్య ఇరుక్కుని వచ్చేస్తుందని నిరూపించిన వాళ్ళలో రామానాయుడు ఒకరు.
నిన్ను విన్నవించుకునేది ఏమిటంటే కొన్నాళ్ళ పాటు మా టాలీవుడ్ వైపుకి రాకు. ప్రజలు తట్టుకో లేకపోతున్నారు. ఇది విన్నపం అనుకుంటావో ఆజ్ఞ అనుకుంటావో నీయిష్టం. ఈ కష్టాలనుండి తెరుకునే శక్తి ని పరిశ్రమకి, అందులోని సభ్యులకి, సామాన్య ప్రేక్షకునికి ఇయ్యి. రామానాయుడి ఆత్మ కి శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనో స్థైర్యం కలగాలని విన్నవించుకుంటూ

సెలవు.

Monday 16 February 2015

పోరా, పోటీ నా?



ఉదయం పేపర్ చూడగానే ఒక వార్త నన్ను ఆలోచనలోకి నెట్టింది. "భారత్ పాకిస్తాన్ మధ్య పోరు (war), ఐతిహాసికం" చదవగానే ఏదో కలవరం. ఏదో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిపోతున్నట్లు రాసారు. ఇంక టి‌వి ఛానల్ వాళ్ళు సరేసరి. ప్రపంచ కప్ ఆటల పోటీ లా లేనేలేదు. భారత్ బ్యాట్స్ మన్ కి  పాక్ బౌలర్ కి మధ్య యుద్ధం అని ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా రాసిన కథానిక చదివి కొంచం బాధ కొంచం భయం కూడా కలిగాయి.
ఒక స్నేహితుని దగ్గరనుండి ఫోను వచ్చింది పూజ చేశావా అంటూ. ఏదైనా పర్వదినామా నేను మర్చిపోయానా అనే అనుమానం కలిగింది నాకు. ఏమిటి విశేషం? ప్రత్యేక పూజ ఏమీ చేయలేదే అన్నాను నేను. అదేంటి క్రికెట్ మ్యాచ్ కదా, భారత్ గెలవాలని పూజ చేయలేదా అని. కనీసం ప్రార్థన అయినా చేయి భారత్ గెలవాలి. ఏదో పరీక్ష రాయడానికి వెళ్తున్నట్టు ఒకళ్ళకి ఒకరు అల్ ద బెస్ట్ అంటూ విష్ చేసుకోవడం అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ మ్యాచ్ తో ప్రజలు చాలా రకాలుగా ముడిపడి ఉన్నారు. ఖాళీ స్థలాల్లో పందిళ్ళు వేసి పెద్ద పెద్ద స్క్రీన్ లు పెట్టి టిక్కెట్లు అమ్మినవాళ్లు కొందరైతే  ఉదయం నుండి బార్లు తెరిచి కూర్చున్నవారు కొందరు. ఒక టి‌వి ఛానల్ వాళ్ళు అమితాభ్ బచన్ ని తెస్తే వేరే ఛానల్ వాళ్ళు ఇంకో సెలెబ్రేటి ని తెచ్చారు. సినిమాకి వెళ్దామని బుక్ మై షో ఓపెన్ చేస్తే మొన్న శుక్రవారం విడుదల అయిన సినిమా కి హాల్ అంతా ఖాళీ. ఎప్పుడూ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే వీధులు నిర్మానుష్యం. అన్నికంటే వింత అయిన విశేషం ఏమిటంటే ఒక పెళ్ళికి వెళ్లవలసి వచ్చి వేదిక చూద్దామని శుభలేఖ తెరిచిన నాకు ఆశ్చర్యానికి అమ్మమ్మ లాంటిది ఏదో కలిగింది. అది ఏమిటంటే శుభలేఖ లో గమనిక: భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూపబడును అని వేశారు. పెళ్ళికి ఎవరూ రారేమో అనే గాబరా వాళ్ళది. పెళ్లి వేదికలో తెరలు పెట్టి మరీ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూపించారు పెళ్ళివారు.
సాయంత్ర సమయంలో దీపావళి సంబరాలు. మ్యాచ్ మంచి రసవత్తరం గా లేదని కొందరిలో అసంతృప్తి ఉన్నా ఘనవిజయ సంబరాలను అందరూ జరుపుకున్నారు.

సమాంతర వినోదం గా ఫేస్ బుక్ ఇంకా వాట్స్ ఆప్ లో మ్యాచ్ కి ముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంకా మ్యాచ్ అయిన తరువాత వచ్చిన జోక్ లకి ప్రజల సృజన, సమయస్ఫూర్తి లకు చక్కని వేదిక దొరికింది అనిపించింది.