మహారాష్ట్ర లో కంటే ఆంధ్రా లో సాయి భక్తులు భలే రకరకాలు
కనిపిస్తూ ఉంటారు.
అప్పట్లో కేబుల్ టివి లో రోజూ మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి
సినిమా వేసేవారు. అందులో మధ్యాహ్నం చాలా సార్లు సాయిబాబా మహత్యం సినిమా ఉండేది. కొంత మంది
భక్తులు సాయిబాబా సినిమా చూపిస్తాం అని మొక్కుకుని కేబుల్ వాడికి ఆ కేసట్ ఇంకా
కొన్ని డబ్బులు ఇచ్చేవారు.
XXX
కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా.
ఇద్దరు కుర్రాళ్ళు(10-12) వయసు ఉన్నవాళ్ళు ఒక పుస్తకం తీసుకుని వచ్చారు. ఎవరు మీరు
అని అడిగితే ఎవరో ఫలానా వాళ్ళు చెప్తే వచ్చామండీ, మేము ఒక వ్రతం
చేస్తున్నాం 108 సాయిబాబా ఫోటోలు చూడాలి. మీ ఇంట్లో ఉన్నాయి అని చెప్తే వచ్చాం
అని. ఏ సాయి బాబా? షిర్డినా,
పుట్టపర్తి బాబానా అని అడిగా. షిర్డి బాబా అంటూనే హాల్లో ఉన్న బాబాఫోటోలను
లెక్కపెట్టుకుంటున్నారు. అమ్మ వాళ్ళని అన్ని గదుల్లోకి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న
చిన్న పెద్ద ఫోటోలు, కాలెండర్లు,
షిరిడీ ప్రసాదం పాకట్లలో ఉండే చిన్న బొమ్మ దగ్గరనుంచి దాచిన అన్ని ఫోటోలు
విగ్రహాలు మొత్తం చూపించింది. మాయింట్లోనే వాళ్ళకి ముప్పై పైచిలుకు అయ్యాయి. ఇలాంటి ఇళ్ళు
నాలుగు తగిలితే మీ వ్రతం పూర్తి అయిపోతుంది అన్నా నేను వాళ్ళతో. వేళాకోళం చేయొద్దని
అమ్మ మందలించింది కూడా.
XXX
ఒక సారి మా బంధువుల ఇంటికి చుట్టంచూపుగా వెళ్ళినపుడు ఆ
కాలనీలో ఎవరో సాయి పూజా, ఉద్యాపన చేసుకుంటున్నారు అంటే మా బంధువు
నన్ను కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడ నేను కాక ఇంకో పదిమంది ఆడవాళ్ళు
ఉన్నారు. అందరూ సాయిబాబా మహత్యాల గురించి, ఎవరు ఎన్ని సార్లు
ఉల్లిపాయ, వంకాయ, పంచదార మొదలైనవి
మానేశారో, వాళ్ళని బాబా ఎలా కటాక్షించారో చెప్పుకుంటున్నారు.
ఆ ఉద్యాపనలో భాగంగా ఆ ఇంటి ఆవిడ నాకు తాంబూలంతో పాటు ఒక పుస్తకం ఇవ్వబోయింది.
"ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళు ఈ వ్రతం తప్పకుండా చేయాలి అంటే మాత్రం నా బదులు
ఇంకెవ్వరికైనా ఇవ్వండి. ఇలాంటి వ్రతాలు నేను అంతగా చేయను" అని ఆవిడతో చాలా
సున్నితంగా చెప్పాను. మీరు చేయాలని నియమం ఏమీ లేదు, నా
శ్రద్ధ కొద్దీ నేను ఇస్తున్నా అని ఆవిడ చెప్పుతుండగా ఇంకో పెద్దావిడ "ఈ వ్రతం
చాలా మంచిది. మనసులోని కోరిక చెప్పి ముడుపు కట్టి 5,11 ఇలా
నీకు కుదిరినన్ని వారాలు పూజ చేసి, ఉద్యాపన చేస్తే ఆ కోరిక
తీరుతుంది. తీరాకా షిరిడీ వెళ్ళి మొక్కు తీర్చుకో. అంతే కానీ పుస్తకం
వద్దనకు" అని మందలించడం, నా బంధువు ఇంక మాట్లాడకు అని
వారించడం ఒకేసారి జరిగాయి. ఇంతలో ఇంకొక ఆవిడ అందుకుంది. ఇలా అవమానిస్తే పాపం.
తేరుకోలేని కష్టాలు వస్తాయి. అసలు బాబా అంటే ఎవరనుకున్నావ్. అసలైన దేవుడు బాబా.
ఆయన మహిమలు నీకేమి తెలుసు. ధుని ని దర్శిస్తే మన పాపాలన్నీ పోతాయి. ఇప్పటికీ సమాధి
నుంచి ఆయన భక్తులకెందరికో దర్శనం ఇచ్చారు...... ఇలా ఉపన్యాసం మొదలు పెట్టింది. మీ
వదిన నాస్తికురాలా? ఆమెని ఈ ఉద్యాపనకి ఎందుకు తీసుకువచ్చావ్
అని మా బంధువుని అందరూ ప్రశ్నలతో సంధిస్తుంటే నాకు ఇక్కడకి రాకుండా ఉంటే బాగుణ్ణు
అనిపించింది. వ్రతమహిమ చెప్పిన పెద్దావిడ ఒకసారి సాయిబాబా చరిత్ర పారాయణం చేయించు
మీ వదినతో అన్నీ అవే సర్దుకుంటాయి అని సలహా కూడా ఇచ్చింది.
నాస్తికురాలు కాదండీ. దైవ భక్తి,
ఆరాధన అన్నీ ఉన్నాయి. అయితే ఇలా నోములు వ్రతాలు అవీ చేయదు అంతే అంటూ పాపం
సమర్ధించుకుంటోంది ఈమె. ఆమెని కాపాడాలని నేను నోరు విప్పాను.
" సాయిబాబా చరిత్ర నేను చదివాను. అయితే మిగిలిన
పురాణాలు, గీత చదివినట్టు చదివాను. బాబా చరిత్ర నుంచి నాకు అర్థం అయినది
ఏమిటంటే - బాబా ఒక యోగి. ఈ ప్రపంచంలో వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పిన యోగిక జీవనం పాటించడం కష్టం కాదు అని ఆచరించి
చెప్పిన వ్యక్తి బాబా. ఆ సమయంలో మన దేశాన్ని హిందూ ముస్లిం పేరుతో ముక్కలు
చేయాలనుకునే శత్రువుల బారి నుండి కాపాడి, హిందూ, ముస్లిం లు సోదరులు అని తెలపడానికి ఆహార్యం ముస్లిం ది, ఆచరణ హిందువుది
చేసి ఇద్దరినీ ఒకేవైపు దృష్టి ని కేంద్రీకరించేలా చేసిన సంఘ సంస్కర్త ఆయన.
ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దాం అనే ఆలోచన రావడం తోనే మనం వారికి ఋణ పడతాం. కానీ
మనిషికి సహజంగా ఉండే లోభత్వం, స్వార్థం కారణంగా ఆ సహాయం
చేయడం దాటవేస్తూ ఉంటాం. అలాంటి వారినుండి డబ్బులు అడిగి తీసుకుని వారిని
రుణవిముక్తులని చేశారు. నాట్యం చేస్తూ భజన చేయడాన్ని మించిన ధ్యానం లేదని భక్తులతో ఆటలాడించేవారు బాబా. ఆ సమయంలో ప్రజలని పట్టి పీడిస్తున్న కలరా, మశూచి వంటి వ్యాధులు పాకకుండా, అడవి నుండి ఔషధ
గుణాలున్న కట్టెలని తెచ్చి ఎండబెట్టి ధుని వెలిగించి వాతావరణం లోని ఆ
బ్యాక్టీరియాని నిర్మూలించిన సైంటిస్ట్ బాబా. మనిషికి కోరికలు లేకపోవడమే అసలైన సంతోషం
అని చెప్పడానికి పాడుబడిన మసీదులో ఎటువంటి ఆడంబరాలు లేకుండా జీవనం సాగించారు. మనిషి
పరోపకారం కోసం తలుచుకుంటే ఏవైనా చేయగలడు అని లోకానికి చెప్పడానికి నీటితో దీపాలు
వెలిగించాడు. వేదాల్లో చెప్పబడినట్లు యోగ సాధన వల్ల శరీరం నుంచి ప్రాణాన్ని వేరుచేయడం సాధ్యమే అని తన
శరీరాన్ని కొన్ని గంటల సమయం విడిచి నిరూపించిన మాహా యోగి బాబా. ఇప్పటికీ షిరిడీ లో
ఆయన సమాధి నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించే సాధన
మనకి ఉండాలే కానీ.
నేను మొదటి
సారి షిరిడీ వెళ్ళినపుడు ఇలాంటి అనుభవమే నాకు కలిగింది. మేము మా స్నేహితులు
కలిసి షిరిడీ వెళ్ళాం. అంతకు కొన్ని రోజుల
ముందే నేను ఒక ధ్యాన శిబిరం అటెండ్ చేసి వచ్చాను. ఆ శిబిరంలో మూడు రోజుల మౌనం కూడా
ఉంది. ఆ మౌనం నాకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడం వల్ల నేను రోజూ లేచిన
దగ్గర నుంచి ఉదయం 9 గంటల వరకు మౌనం పాటించేదాన్ని. తెల్లవారుఝామున
వెళ్ళి క్యూ లో నిల్చున్నాం. ఇంచుమించు నాలుగు గంటలు గడిచింది. ప్రధాన మందిరంలోకి
ప్రవేశించాం. సాయినాథ్ మహరాజ్ కీ జై అంటూ భక్తులు కదులుతున్నారు. నాతో
వచ్చినవాళ్లు ముగ్గురు ముందుకి వెళ్లారు. సరిగా నా దగ్గర క్యూ ఆపారు. బాబా విగ్రహం
దగ్గర భక్తులు విసిరిన పువ్వులు, మాలలు శుభ్రం చేస్తున్నారు.
అయిదు నిమిషాల పాటు నాకు బాబావారి విగ్రహం ముందు నుంచునే అవకాశం దొరికింది. ఆ
ప్రసన్నమైన ముఖం చూస్తూ అలా అప్రయత్నంగా నా కళ్ళు మూసుకున్నాయి. ఇంతలో వెనక ఉన్న
ఆవిడ నన్ను తట్టింది. ఇంతదూరం వచ్చి ఇప్పుడు కళ్ళు మూసుకుంటావెంటీ? పువ్వులు, మాలలు ఏవీ తేకుండా వచ్చావా? ఎదిగో ఇది తీసుకో అని తన చేతిలో ఉన్న ఒక గులాబీ గుచ్ఛం నాకు ఇచ్చింది.
ఇంతలో నా ముందు పెట్టిన తాడు తీయడం నన్ను జబ్బ పట్టి లాగి బయటకి తోసేయడం
జరిగిపోయాయి. బయట మా వాళ్ళు అబ్బా దానికి భలే ఛాన్స్ దొరికింది అనుకుంటూ నాకోసం
ఎదురుచూస్తున్నారు. తొమ్మిది అయింది ఇంక ఆ నవ్వు ఆపి మాట్లాడు అని నా భర్త
హెచ్చరించారు. (ఆయనకి నా మౌనం ఇబ్బందిగా ఉండేది పాపం). అక్కడే ఉన్న సెక్యూరిటీ
అతన్ని ఇక్కడ బాబా సమాధి ఉంటుందిట ఎక్కడ అని అడిగా నాకు తెలియక. అదేంటమ్మా ఇప్పుడు
నువ్వు దర్శనం చేసినది అదే కదా? సమాధి మీద విగ్రహం పెట్టారు.
ఆ పక్కన ద్వారకామాయి ఉంటుంది అది చూసి వెళ్ళండి అన్నాడు అతను. అప్పుడు కానీ
తెలియలేదు భక్తులు బోర్లా పడుకుని మరీ ఎందుకు దణ్ణం పెట్టుకుంటున్నారో. మళ్ళీ
ఒక్కసారి వెళ్దాం అన్నా మా వారితో. చాల్లే నాలుగు గంటలు పట్టింది ఇప్పటికే. పోనీ
ద్వారకామాయి చూద్దాం అన్నా. అటువైపు వెళ్తే అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. అమ్మో ఇంక
ఓపిక లేదు. మధ్యాహ్నం నుంచి లోకల్ గా చూడడానికి బండి మాట్లాడాం. రేపు నాసిక్
అటునుండి మన ట్రైన్. రేపు ఉదయం బయలుదేరేముందు వద్దామ్ లే అని సర్ది చెప్పగా
అటునుంచి అలా షాపింగ్ చూసుకుంటూ, ప్రసాదాలు, స్నేహితులకి పంచడానికి బాబా ఫోటోలు అవీ అన్నీ కొనుక్కుని భోజనం చేసి కాస్త
విశ్రాంతి తీసుకుందాం అని రూమ్ కి వెళ్ళాం. తెల్లవారి లేవడం వల్ల, ఎండలో తిరగడం వల్లనేమో నాకు నిద్ర పట్టింది. ఆ నిద్రలో కల. ఒక వేప చెట్టు
ఉంది దాని దగ్గర ఒక గట్టు ఉంటుంది షిరిడీలో. అక్కడ నేను కూర్చున్నా ఒంటరిగా. అక్కడ
ఇంకెవ్వరూ లేరు. ఇంతలో నన్ను ఎవరో తట్టినట్టు అనిపిస్తే అటు చూశాను. విగ్రహంలోని
ముఖానికి పోలికలు ఉన్న అదే ఆహార్యంలో ఉన్న ఒక వ్యక్తి, "నా సమాధి చూడలేదు అని బాధ పడుతున్నావ్ గా
రా చూపిస్తా" అని నన్ను చేయి పట్టుకుని మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ
ఒక్క సమాధి ఉంది ఆ విగ్రహం లేదు. ఒక మూల నన్ను తీసుకువెళ్లిన వ్యక్తి(బాబా)
నుంచుని, తనివి తీరా తాకు నా సమాధిని,
కావాలంటే బోర్లా కూడా పడుకో. నేను అలాగే చేశా. ఏదో ఆనందం. ఆ తరవాత బాబా
ద్వారకామాయి కి కూడా తీసుకువెళ్లాడు. ఆయనే స్వయంగా ధుని, తిరగలి అన్నీ చూపించాడు. ఇంతలో నన్ను తెములు అంటూ నా స్నేహితురాలు నిద్ర
లేపింది. కల అయినా ఆ సన్నివేశం నాలో కళ్ళకి కట్టినట్టు కనిపించింది. చాలా కాలం
అవన్నీ ఏవో వీడియోలు చూసినట్టు గుర్తువున్నాయి. మర్నాడు ఉదయం లేచి తెమలడం ఆలస్యం
అవ్వడం వల్ల మళ్ళీ మందిరానికి వెళ్లకుండానే నాసిక్ వెళ్ళడం,
అక్కడ శివాలయంలో నాలుగు గంటలు లైన్ లో నిల్చున్నా దర్శనం అవ్వక ట్రైన్ టైమ్
అవుతోంది అని వెనక్కి వెళ్ళడం జరిగాయి. రెండు సంవత్సరాల తరవాత మరలా షిరిడీ వెళ్ళిన నాకు
సమాధిని, ద్వారకామాయి ని చూసి ఆశ్చర్యం, ఆనందం. కలలో చూసినట్టే ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన డ్రీమ్
అనాలిసిస్ ఇక్కడ తప్పు అయింది. (ఇంతకు ముందు మనం చూసిన లేదా విజువలైజ్ చేసుకున్నవి
మాత్రమే కలల్లా కనిపిస్తాయి అంటూ చాలా రకాల సిద్ధాంతాలు రాశాడు. చాలా మంచి
పుస్తకం. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవచ్చు.)
భక్తి అనేది బయటకి ప్రదర్శించేది కాదు, ఆ అనుభూతి మన మనసుతో అనుభవించాలి, దేవుని మీద ఉండవలసినది భయం కాదు, నమ్మకం అని నా అభిప్రాయం.
ఇది నా అనుభవం, ఇంకా అభిప్రాయం. ఎవరి మనోభావాలని
గాయపరచడానికి రాయలేదని మనవి.