Saturday 24 September 2016

కామెడీ నాకిష్టం


నాకు రెండు జతల కళ్ళు, రెండు టి‌వి లు ఉంటే ఎంతబాగుణ్ణో అనిపించింది ఒకరోజు. ఎందుకలా???
మీరే చదవండి.
చేతులు ఖాళీ లేనప్పుడే ఈ ఫోన్ మోగుతుంది అనుకుంటుండగా " మీ అమ్మగారి ఫోన్" అని మా వారు అనడం నేను ఫోన్ ఎత్తడం. "ఈ టి‌వి లో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా వస్తోంది" అమ్మ వాక్యం పూర్తి అవ్వకుండానే ఫోన్ పెట్టేయడం
, చేతిలో గరిటో, చీపురో గుర్తు లేదుకానీ దాన్ని వదిలేయడం జరిగిపోయాయి. అప్పుడే మొదలైంది హమ్మయ్య అనుకోవడం, సినిమాలో మునిగిపోవడం, కొన్ని క్షణాల్లో ఎన్ని జరిగిపోయాయో కదా.... నాకళ్ళకీ టి‌వి కి మధ్య నాలుగుసార్లు వచ్చారు మావారు ఆఫీస్ కి రెడీ అయ్యా అని చెప్పడానికి. ఇహ లాభం లేదనుకున్నారో ఏమో 'టైమ్ ఎంత అయిందో తెలుసా' అన్నారు. దానికి నన్ను డిస్టర్బ్ చేయాలా గడియారం చూసుకోవచ్చుగా అన్నా. భారతదేశం లో ఉన్న అసహనం అంతా ముఖాన్న పూసుకుని. ఈ సినిమా డైలాగులే కానీ మామూలు మాటలు మర్చిపోయింది , ఏదైనా తినడానికి పెడితే ఆఫీస్ కి వెళ్తా అన్నారు. సరే అన్నా కానీ లేవలేదు. సినిమా చూస్తున్నా అని జాలి, దయ, ప్రేమ ఉండాలా లేదా? రోజూ వెళ్ళే ఆఫీసే కదా. నా పరిస్థితి గ్రహించద్దూ రోజూ ఇలాంటి సినిమాలోస్తాయా, నేను చూస్తానా?’ నాలో నేనే. పాపం మా వారు లాతూర్ వాళ్ళు వర్షం కోసం ఎదురుచూసినట్టు సినిమాలో బ్రేక్ కోసం వెయిటింగ్. ఆయన పంట పండి ఆ బ్రేక్ రానేవచ్చింది. ఈరోజు మావారు లేచిన వేళ అంత బాగోలేదు పాపం. నేనిలా వంటింట్లోకి వెళ్ళా అని ఆయన ఛానల్ మార్చారా అక్కడేమో నువ్వు నాకు నచ్చావ్. ఇంక అయిపోయింది నా పని అని నాలుక కరుచుకుని గబుక్కున మార్చేలోపే చటుక్కున త్రివిక్రమ్ మాటలు చెవికి తాకేసాయ్. ఆపండాపండి అంటూ వచ్చేశా. ఇంక ఇలా కాదు అని ఉప్మాలా ఉండే ఉప్మా చేసేసి ఆయన్ని పంపేసి టి‌వి దగ్గర సెటిల్ అయిపోయా.
ఇక్కడ శ్రీలక్ష్మి చెప్పే సినిమా కథ టైటిల్స్ తో సహా విందామంటే అక్కడ వెంకటేష్ బయోగ్రఫీ మిస్ అయిపోతా, అక్కడ బంతి చేసే కామెడీ తాగాలంటే, ఇక్కడ సంగీత వంటలు తినలేకపోతున్నా. ఇటు సుత్తివీరభద్ర రావు గోడకి తన బాధ మొరపెట్టుకుంటుంటే, అటు హరికథ అంత ఇంటరెస్టింగ్ లేక సినిమాకి వెళ్లిపోవడం.  పొట్టిప్రసాద్ ఒక ఆట వేసుకుందాం అని ఇటు పిలుస్తుంటే, అక్కడ అమ్మ మీద కవిత రా రమ్మంటోంది. పూర్ణిమ కల ఇటువైపు, వెంకీ చేసే పెళ్లి ఏర్పాట్లు అటువైపు. ఉత్తరం అందుకున్న సుత్తివేలు హావభావాలు ఆస్వాదించేలోపే హేమ కాళ్ళు కడగడం, ఎం‌ఎస్ పేకాట పర్వం మిస్ అయిపోయా. ఇక్కడ మంచి రసపట్టులో కథ, పూర్ణిమ అప్సెట్ అవడం, ఉత్తరం ముడి విడిపోవడం, అక్కడ బ్రహ్మీ పార్క్ లో చేసే విన్యాసం.  అబ్బో ఏమి చెప్పమంటారు నా బాధ.
ఒకపక్క జంధ్యాల విసిరే నవ్వుల వల, ఇంకో పక్క త్రివిక్రమ్ చేసే మాటల గడబిడ.
ఒకవైపు జంధ్యాల నిఘంటువుకే మాటలు నేర్పుతుంటే, ఇంకోవైపు త్రివిక్రమ్ మాటల పంచ్ లు వదలడం.
ఇక్కడ పెళ్లి కాన్సిలా, చీర ఇప్పెయనా అనే కామెడీ క్లైమాక్స్, అక్కడ పెళ్లి ఆగిపోయే సీరియస్ క్లైమాక్స్. బాబోయ్ ఏమి చేయను దేవుడా అని బుర్ర గోక్కొవడం.
చక్కటి చతురత, సుత్తి ద్వయం హాస్యం, మాటలతో మనుషుల్ని కట్టి పడేయొచ్చు అని జంధ్యాల గారికి ఎవరు నేర్పారో కదా. ఎన్నేళ్లయినా ఆ పరిమళం తగ్గనే లేదు. ఎన్ని సార్లు ఆస్వాదించినా మళ్ళీ కొత్తగా అనిపించే ఆ తీయదనం.
తెలుగు సినిమాని మాటలతో హిట్ కొట్టించచ్చు అని నిరూపించిన త్రివిక్రమ్. ఒక బలమైన విలన్, ఒక బక్క మొనగాడు అతి బలంగా దెబ్బకొట్టడం(మనం నమ్మాలి అది వేరే సంగతి) ఇవే అలవాటైపోయిన మనకి కేవలం మాటలతో సినిమా హిట్ కొట్టించవచ్చు అని, సినిమాల్లో మాటల మీద శ్రద్ధ పెట్టాలని అందరి దృష్టిని మార్చేలా రాశాడు సినిమాలకి మాటలు.
నాకు నచ్చిన ఇద్దరి సినిమాలలో అంశాలు చెప్పా కానీ ఒకళ్లకంటే ఇంకోళ్ళు గొప్ప అనలేదు, ఒకళ్లతో ఇంకొకళ్లని పోల్చనూ లేదు కనుక కామెంటుల మీటింగులు పెట్టద్దని మనవి.
రెండు సినిమాలు పూర్తిగా చూడలేక, తృప్తి పడలేక తరవాత యూ ట్యూబ్ ని ఆశ్రయించా అనుకోండి అది వేరే విషయం. మీకు కూడా మళ్ళీ చూడాలనిపిస్తే యూ ట్యూబ్ లో చూడొచ్చోచ్.........


Monday 18 July 2016

ఉత్తరం

ఉత్తరం

ఏమయ్యావమ్మా అందమైన ఉత్తరమా 
మధ్యాహ్నం ఉదయించే మా ఆశల బింబమా

తీపి కబురు తొందరగా చేదు కబురు గాఢంగా
తీసుకు వచ్చేదానివి నువు ఆదరబాదరగా

నీకొరకై ఉండేది మా మదిలో నిరీక్షణ
అది కాస్తా పెంచేది పోస్ట్ మాన్ పై ఆకర్షణ

ఆలుమగల విరహానికి నువ్వేగా సాక్ష్యం
అన్నదమ్ముల అనుబంధం పెంచడమే నీ లక్ష్యం

పుట్టింటి ఆపేక్షని మడత పెట్టి తెచ్చావు
మెట్టింటి బాధ్యతని నీ భుజాన మోసావు

స్నేహాన్ని ఒక చేత్తో కర్తవ్యం మరో చేత్తో
శుభలేఖలు శుభాకాంక్షలు చేర్చావు మురిపెంతో

ఒకసారి మరోసారి చదివి మరీ మురిసాము
జవాబుగా నీ మీదే మనసంతా పరిచాము

అక్షయపాత్రేగా మరి ఆ ఇన్లాండ్ కవరు
ఉభయకుశలోపరికి చిన్న కార్డే బెటరు

కార్డయినా కవరయినా ఇన్లాండ్ లెటరయినా
మనియార్దర్ రూపంలో ధనసాయం చేసినా

సహభాగం అయ్యావు ఊసులందించావు
మనుషులని దరి చేర్చి ఊతమందించావు

ఎస్సెమ్మెస్ వాట్సాపు ఫేసుబుక్కు ఈమెయిలు
ఏమొచ్చిన మరువలేము నువ్వు చేసిన ఈ మేలు

స్పీడు పోస్ట్ రిజిస్టర్ బుక్ పోస్ట్ ల వివరాలు
అవసరానికి తగినట్టు మారిన నీ రూపాలు

స్టాంపుల కోసం వాడిన మా ఎంగిలి నాలుకలు
తక్కువైన నాడు పడినాయి గా పెనాల్టీలు

నేడు గేటుకు తగిలించిన ఇనప రేకు డబ్బాలు
ఎమున్నాయి చూడ్డానికి మా బిల్లులు రశీదులు

మా ముత్తాతల ఉత్తరాలు చేర్చాయిట పావురాలు
మా బిడ్డలు నీ ఉనికిని ఎరుగనే ఎరుగరు

Wednesday 6 July 2016

సాయి మానియా




మహారాష్ట్ర లో కంటే ఆంధ్రా లో సాయి భక్తులు భలే రకరకాలు కనిపిస్తూ ఉంటారు.
అప్పట్లో కేబుల్ టి‌వి లో రోజూ మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి సినిమా వేసేవారు. అందులో మధ్యాహ్నం చాలా సార్లు సాయిబాబా మహత్యం సినిమా ఉండేది. కొంత మంది భక్తులు సాయిబాబా సినిమా చూపిస్తాం అని మొక్కుకుని కేబుల్ వాడికి ఆ కేసట్ ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చేవారు.

XXX

కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇద్దరు కుర్రాళ్ళు(10-12) వయసు ఉన్నవాళ్ళు ఒక పుస్తకం తీసుకుని వచ్చారు. ఎవరు మీరు అని అడిగితే ఎవరో ఫలానా వాళ్ళు చెప్తే వచ్చామండీ, మేము ఒక వ్రతం చేస్తున్నాం 108 సాయిబాబా ఫోటోలు చూడాలి. మీ ఇంట్లో ఉన్నాయి అని చెప్తే వచ్చాం అని. ఏ సాయి బాబా? షిర్డినా, పుట్టపర్తి బాబానా అని అడిగా. షిర్డి బాబా అంటూనే హాల్లో ఉన్న బాబాఫోటోలను లెక్కపెట్టుకుంటున్నారు. అమ్మ వాళ్ళని అన్ని గదుల్లోకి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఫోటోలు, కాలెండర్లు, షిరిడీ ప్రసాదం పాకట్లలో ఉండే చిన్న బొమ్మ దగ్గరనుంచి దాచిన అన్ని ఫోటోలు విగ్రహాలు మొత్తం చూపించింది. మాయింట్లోనే వాళ్ళకి ముప్పై పైచిలుకు అయ్యాయి. ఇలాంటి ఇళ్ళు నాలుగు తగిలితే మీ వ్రతం పూర్తి అయిపోతుంది అన్నా నేను వాళ్ళతో. వేళాకోళం చేయొద్దని అమ్మ మందలించింది కూడా.

XXX

ఒక సారి మా బంధువుల ఇంటికి చుట్టంచూపుగా వెళ్ళినపుడు ఆ కాలనీలో ఎవరో సాయి పూజా, ఉద్యాపన చేసుకుంటున్నారు అంటే మా బంధువు నన్ను కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడ నేను కాక ఇంకో పదిమంది ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ సాయిబాబా మహత్యాల గురించి, ఎవరు ఎన్ని సార్లు ఉల్లిపాయ, వంకాయ, పంచదార మొదలైనవి మానేశారో, వాళ్ళని బాబా ఎలా కటాక్షించారో చెప్పుకుంటున్నారు. ఆ ఉద్యాపనలో భాగంగా ఆ ఇంటి ఆవిడ నాకు తాంబూలంతో పాటు ఒక పుస్తకం ఇవ్వబోయింది. "ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళు ఈ వ్రతం తప్పకుండా చేయాలి అంటే మాత్రం నా బదులు ఇంకెవ్వరికైనా ఇవ్వండి. ఇలాంటి వ్రతాలు నేను అంతగా చేయను" అని ఆవిడతో చాలా సున్నితంగా చెప్పాను. మీరు చేయాలని నియమం ఏమీ లేదు, నా శ్రద్ధ కొద్దీ నేను ఇస్తున్నా అని ఆవిడ చెప్పుతుండగా ఇంకో పెద్దావిడ "ఈ వ్రతం చాలా మంచిది. మనసులోని కోరిక చెప్పి ముడుపు కట్టి 5,11 ఇలా నీకు కుదిరినన్ని వారాలు పూజ చేసి, ఉద్యాపన చేస్తే ఆ కోరిక తీరుతుంది. తీరాకా షిరిడీ వెళ్ళి మొక్కు తీర్చుకో. అంతే కానీ పుస్తకం వద్దనకు" అని మందలించడం, నా బంధువు ఇంక మాట్లాడకు అని వారించడం ఒకేసారి జరిగాయి. ఇంతలో ఇంకొక ఆవిడ అందుకుంది. ఇలా అవమానిస్తే పాపం. తేరుకోలేని కష్టాలు వస్తాయి. అసలు బాబా అంటే ఎవరనుకున్నావ్. అసలైన దేవుడు బాబా. ఆయన మహిమలు నీకేమి తెలుసు. ధుని ని దర్శిస్తే మన పాపాలన్నీ పోతాయి. ఇప్పటికీ సమాధి నుంచి ఆయన భక్తులకెందరికో దర్శనం ఇచ్చారు...... ఇలా ఉపన్యాసం మొదలు పెట్టింది. మీ వదిన నాస్తికురాలా? ఆమెని ఈ ఉద్యాపనకి ఎందుకు తీసుకువచ్చావ్ అని మా బంధువుని అందరూ ప్రశ్నలతో సంధిస్తుంటే నాకు ఇక్కడకి రాకుండా ఉంటే బాగుణ్ణు అనిపించింది. వ్రతమహిమ చెప్పిన పెద్దావిడ ఒకసారి సాయిబాబా చరిత్ర పారాయణం చేయించు మీ వదినతో అన్నీ అవే సర్దుకుంటాయి అని సలహా కూడా ఇచ్చింది.
నాస్తికురాలు కాదండీ. దైవ భక్తి, ఆరాధన అన్నీ ఉన్నాయి. అయితే ఇలా నోములు వ్రతాలు అవీ చేయదు అంతే అంటూ పాపం సమర్ధించుకుంటోంది ఈమె. ఆమెని కాపాడాలని నేను నోరు విప్పాను.

" సాయిబాబా చరిత్ర నేను చదివాను. అయితే మిగిలిన పురాణాలు, గీత చదివినట్టు చదివాను. బాబా చరిత్ర నుంచి నాకు అర్థం అయినది ఏమిటంటే - బాబా ఒక యోగి. ఈ ప్రపంచంలో వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పిన యోగిక జీవనం పాటించడం కష్టం కాదు అని ఆచరించి చెప్పిన వ్యక్తి బాబా. ఆ సమయంలో మన దేశాన్ని హిందూ ముస్లిం పేరుతో ముక్కలు చేయాలనుకునే శత్రువుల బారి నుండి కాపాడి, హిందూ, ముస్లిం లు సోదరులు అని తెలపడానికి ఆహార్యం ముస్లిం ది, ఆచరణ హిందువుది చేసి ఇద్దరినీ ఒకేవైపు దృష్టి ని కేంద్రీకరించేలా చేసిన సంఘ సంస్కర్త ఆయన. ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దాం అనే ఆలోచన రావడం తోనే మనం వారికి ఋణ పడతాం. కానీ మనిషికి సహజంగా ఉండే లోభత్వం, స్వార్థం కారణంగా ఆ సహాయం చేయడం దాటవేస్తూ ఉంటాం. అలాంటి వారినుండి డబ్బులు అడిగి తీసుకుని వారిని రుణవిముక్తులని చేశారు. నాట్యం చేస్తూ భజన చేయడాన్ని మించిన ధ్యానం లేదని భక్తులతో ఆటలాడించేవారు బాబా. ఆ సమయంలో ప్రజలని పట్టి పీడిస్తున్న కలరా, మశూచి వంటి వ్యాధులు పాకకుండా, అడవి నుండి ఔషధ గుణాలున్న కట్టెలని తెచ్చి ఎండబెట్టి ధుని వెలిగించి వాతావరణం లోని ఆ బ్యాక్టీరియాని నిర్మూలించిన సైంటిస్ట్ బాబా. మనిషికి కోరికలు లేకపోవడమే అసలైన సంతోషం అని చెప్పడానికి పాడుబడిన మసీదులో ఎటువంటి ఆడంబరాలు లేకుండా జీవనం సాగించారు. మనిషి పరోపకారం కోసం తలుచుకుంటే ఏవైనా చేయగలడు అని లోకానికి చెప్పడానికి నీటితో దీపాలు వెలిగించాడు. వేదాల్లో చెప్పబడినట్లు యోగ సాధన వల్ల శరీరం నుంచి ప్రాణాన్ని వేరుచేయడం సాధ్యమే అని తన శరీరాన్ని కొన్ని గంటల సమయం విడిచి నిరూపించిన మాహా యోగి బాబా. ఇప్పటికీ షిరిడీ లో ఆయన సమాధి నుంచి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించే సాధన మనకి ఉండాలే కానీ.
      నేను మొదటి సారి షిరిడీ వెళ్ళినపుడు ఇలాంటి అనుభవమే నాకు కలిగింది. మేము మా స్నేహితులు కలిసి  షిరిడీ వెళ్ళాం. అంతకు కొన్ని రోజుల ముందే నేను ఒక ధ్యాన శిబిరం అటెండ్ చేసి వచ్చాను. ఆ శిబిరంలో మూడు రోజుల మౌనం కూడా ఉంది. ఆ మౌనం నాకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడం వల్ల నేను రోజూ లేచిన దగ్గర నుంచి ఉదయం 9 గంటల వరకు మౌనం పాటించేదాన్ని. తెల్లవారుఝామున వెళ్ళి క్యూ లో నిల్చున్నాం. ఇంచుమించు నాలుగు గంటలు గడిచింది. ప్రధాన మందిరంలోకి ప్రవేశించాం. సాయినాథ్ మహరాజ్ కీ జై అంటూ భక్తులు కదులుతున్నారు. నాతో వచ్చినవాళ్లు ముగ్గురు ముందుకి వెళ్లారు. సరిగా నా దగ్గర క్యూ ఆపారు. బాబా విగ్రహం దగ్గర భక్తులు విసిరిన పువ్వులు, మాలలు శుభ్రం చేస్తున్నారు. అయిదు నిమిషాల పాటు నాకు బాబావారి విగ్రహం ముందు నుంచునే అవకాశం దొరికింది. ఆ ప్రసన్నమైన ముఖం చూస్తూ అలా అప్రయత్నంగా నా కళ్ళు మూసుకున్నాయి. ఇంతలో వెనక ఉన్న ఆవిడ నన్ను తట్టింది. ఇంతదూరం వచ్చి ఇప్పుడు కళ్ళు మూసుకుంటావెంటీ? పువ్వులు, మాలలు ఏవీ తేకుండా వచ్చావా? ఎదిగో ఇది తీసుకో అని తన చేతిలో ఉన్న ఒక గులాబీ గుచ్ఛం నాకు ఇచ్చింది. ఇంతలో నా ముందు పెట్టిన తాడు తీయడం నన్ను జబ్బ పట్టి లాగి బయటకి తోసేయడం జరిగిపోయాయి. బయట మా వాళ్ళు అబ్బా దానికి భలే ఛాన్స్ దొరికింది అనుకుంటూ నాకోసం ఎదురుచూస్తున్నారు. తొమ్మిది అయింది ఇంక ఆ నవ్వు ఆపి మాట్లాడు అని నా భర్త హెచ్చరించారు. (ఆయనకి నా మౌనం ఇబ్బందిగా ఉండేది పాపం). అక్కడే ఉన్న సెక్యూరిటీ అతన్ని ఇక్కడ బాబా సమాధి ఉంటుందిట ఎక్కడ అని అడిగా నాకు తెలియక. అదేంటమ్మా ఇప్పుడు నువ్వు దర్శనం చేసినది అదే కదా? సమాధి మీద విగ్రహం పెట్టారు. ఆ పక్కన ద్వారకామాయి ఉంటుంది అది చూసి వెళ్ళండి అన్నాడు అతను. అప్పుడు కానీ తెలియలేదు భక్తులు బోర్లా పడుకుని మరీ ఎందుకు దణ్ణం పెట్టుకుంటున్నారో. మళ్ళీ ఒక్కసారి వెళ్దాం అన్నా మా వారితో. చాల్లే నాలుగు గంటలు పట్టింది ఇప్పటికే. పోనీ ద్వారకామాయి చూద్దాం అన్నా. అటువైపు వెళ్తే అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. అమ్మో ఇంక ఓపిక లేదు. మధ్యాహ్నం నుంచి లోకల్ గా చూడడానికి బండి మాట్లాడాం. రేపు నాసిక్ అటునుండి మన ట్రైన్. రేపు ఉదయం బయలుదేరేముందు వద్దామ్ లే అని సర్ది చెప్పగా అటునుంచి అలా షాపింగ్ చూసుకుంటూ, ప్రసాదాలు, స్నేహితులకి పంచడానికి బాబా ఫోటోలు అవీ అన్నీ కొనుక్కుని భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుందాం అని రూమ్ కి వెళ్ళాం. తెల్లవారి లేవడం వల్ల, ఎండలో తిరగడం వల్లనేమో నాకు నిద్ర పట్టింది. ఆ నిద్రలో కల. ఒక వేప చెట్టు ఉంది దాని దగ్గర ఒక గట్టు ఉంటుంది షిరిడీలో. అక్కడ నేను కూర్చున్నా ఒంటరిగా. అక్కడ ఇంకెవ్వరూ లేరు. ఇంతలో నన్ను ఎవరో తట్టినట్టు అనిపిస్తే అటు చూశాను. విగ్రహంలోని ముఖానికి పోలికలు ఉన్న అదే ఆహార్యంలో ఉన్న ఒక వ్యక్తి,  "నా సమాధి చూడలేదు అని బాధ పడుతున్నావ్ గా రా చూపిస్తా" అని నన్ను చేయి పట్టుకుని మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక్క సమాధి ఉంది ఆ విగ్రహం లేదు. ఒక మూల నన్ను తీసుకువెళ్లిన వ్యక్తి(బాబా) నుంచుని, తనివి తీరా తాకు నా సమాధిని, కావాలంటే బోర్లా కూడా పడుకో. నేను అలాగే చేశా. ఏదో ఆనందం. ఆ తరవాత బాబా ద్వారకామాయి కి  కూడా తీసుకువెళ్లాడు. ఆయనే స్వయంగా ధుని, తిరగలి అన్నీ చూపించాడు. ఇంతలో నన్ను తెములు అంటూ నా స్నేహితురాలు నిద్ర లేపింది. కల అయినా ఆ సన్నివేశం నాలో కళ్ళకి కట్టినట్టు కనిపించింది. చాలా కాలం అవన్నీ ఏవో వీడియోలు చూసినట్టు గుర్తువున్నాయి. మర్నాడు ఉదయం లేచి తెమలడం ఆలస్యం అవ్వడం వల్ల మళ్ళీ మందిరానికి వెళ్లకుండానే నాసిక్ వెళ్ళడం, అక్కడ శివాలయంలో నాలుగు గంటలు లైన్ లో నిల్చున్నా దర్శనం అవ్వక ట్రైన్ టైమ్ అవుతోంది అని వెనక్కి వెళ్ళడం జరిగాయి.  రెండు సంవత్సరాల తరవాత మరలా షిరిడీ వెళ్ళిన నాకు సమాధిని, ద్వారకామాయి ని చూసి ఆశ్చర్యం, ఆనందం. కలలో చూసినట్టే ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన డ్రీమ్ అనాలిసిస్ ఇక్కడ తప్పు అయింది. (ఇంతకు ముందు మనం చూసిన లేదా విజువలైజ్ చేసుకున్నవి మాత్రమే కలల్లా కనిపిస్తాయి అంటూ చాలా రకాల సిద్ధాంతాలు రాశాడు. చాలా మంచి పుస్తకం. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవచ్చు.)
భక్తి అనేది బయటకి ప్రదర్శించేది కాదు, ఆ అనుభూతి మన మనసుతో అనుభవించాలి, దేవుని మీద ఉండవలసినది భయం కాదు, నమ్మకం అని నా అభిప్రాయం.
ఇది నా అనుభవం, ఇంకా అభిప్రాయం. ఎవరి మనోభావాలని గాయపరచడానికి రాయలేదని మనవి.


Wednesday 4 May 2016

అమ్మ రుణం తీరేదా?

అమ్మని కోల్పోయి ఈరోజుకి నాలుగు సంవత్సరాలు అయ్యాయి. ఇన్ని ఏళ్ళు అమ్మ లేకుండా ఎలా గడిచిందా అని ఆలోచిస్తే ఆశ్చర్యం తప్ప సమాధానం దొరకలేదు.

నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు నాకు అనుక్షణం గుర్తు వస్తూ ఉంటాయి. అమ్మ అనారోగ్యం నన్ను చాలా బాధించేది. అమ్మని త్వరగా తీసుకుపొమ్మని దేవుణ్ణి  ప్రార్థించిన రోజులు కూడా ఉన్నాయి. కొడుకుని అని ఏమో అక్క, చెల్లాయి కంటే అమ్మ నన్ను కొంచం ఎక్కువ ప్రేమించేది అనిపిస్తుంది నాకు.  ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉంటూ సెలవలకి అమ్మ దగ్గరకి వెళ్లినప్పుడు ఎంతో శ్రమకోర్చి నాకు ఇష్టమైనవి అన్నీ చేసిపెట్టేది. అలాంటి అమ్మ  ఇంత అవస్థ పడడం నాకు చాలా కష్టం తోచేది. పని మనుషులు ఉన్నా దగ్గర ఉండి అమ్మ అవసరాలని చూసుకోవడంలో ఆనందం ఉండేది.  అమ్మ నా పసితనంలో నాకు చేతకాని నా అవసరాలు ఎలా తీర్చిందో అలాగే నాకు వచ్చినట్లుగా ఆవిడ అవసరాలు తీర్చేవాడిని. మగవాడివి ఇవన్నీ నువ్వెందుకు చేయడం పెండ్లి చేసుకోమని బంధువులు సలహాలిచ్చినా ఏనాడూ పట్టించుకోలేదు.



అలాంటి నేను ఒక దుర్దినాన పరిస్థితులకు లొంగిపోవడం వల్లో, నా లోని ఓపిక తగ్గిపోవడం వల్లో లేదా నా దురదృష్టం వల్లో కొంతమంది స్నేహితుల సలహాతో అమ్మని కాకినాడలోని వృద్ధాశ్రమానికి తీసుకుని వచ్చాను. అక్కడి ఫార్మాలిటీలు అన్నీ పూర్తి అయ్యాకా అక్కడ పనిచేసేవారు 'మేము చూసుకుంటాం మీరు వెళ్లిరండి' అని అనగానే నాకు ఉన్నట్టుండి నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది.  " అదేంటి! అమ్మదగ్గర ఎవ్వరం ఉండకుండా వెళ్లిపోతున్నాం. నేను కానీ, అక్క లేదా చెల్లి కానీ ఉండాలి కదా! నేను వెళ్లిపోవడం ఏమిటి, ఇక్కడ ఉండాలి. అమ్మకి ఏదైనా అవసరం వస్తే? 'బాబూ' అని పిలిస్తే? ఇదేంటి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నాను. సెలవు లేకపోతే, ఉద్యోగం పోయేలా ఉంటే మాత్రం ఇలా వదిలేసి వెళ్లిపోదామని ఎందుకు అనుకున్నాను?" రకరకాల ప్రశ్నలు, బుర్రలో ఏవేవో ఆలోచనలు, ఏమిచేయాలో తెలియని పరిస్థితి. తీసుకున్న ఈ నిర్ణయం సరి అయినదేనా అని అనుమానం.
స్నేహితుని ఇంట్లో ఆ రాత్రి పడుకున్నా కానీ ఒక్క క్షణం కునుకు పడితే ఒట్టు. అమ్మకి నిద్ర పట్టిందో లేదో, మందులు వేశారో లేదో, ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడని ఆక్రోశంతో ఉందో, పోనీలే ఎన్నాళ్లని కష్టపడతాడు అని జాలి పడుతోందో, ఆవిడ మనోభావాలు ఎలాఉన్నాయో అనే కలవరం తోనే తెల్లారింది.

నా ఆలోచనలనుంచి తప్పించాలని అనుకున్నాడో, నా బాధ చూడలేకపోయాడో తాను వెళ్తున్న పనికి నన్ను తోడు తీసుకెళ్ళాడు నా మిత్రుడు. అమ్మని చూసి వెళ్దాం అనుకున్నా కానీ, పని అయ్యి రాగానే వెళ్దాంలే అని స్నేహితునితో వెళ్ళాను. దారిలో ఉండగానే ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ ఇక నాకు లేదనే వార్త నేను జీర్ణిచుకోవడం తప్ప నాదగ్గర వేరే దారి లేదు.
ఎవరో చెప్తున్నారు నేను చేస్తున్నా. మంత్రాలు చెవిని చేరుతున్నాయి కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతోంది. " అమ్మ లేకుండా నేను ఉండాలి అనే దుఃఖం, అమ్మ అనే ధైర్యం కోల్పోయాను అనే భయం, చివరి సమయంలో దగ్గర ఉండలేకపోయానే అనే బాధ, ఇదే మరణం అమ్మకి రెండురోజుల ముందు ఇవ్వొచ్చు కదా అని దేవుని మీద కోపం"

రోజులు, నెలలు సంవత్సరాలు గడిచినా ఈ సంఘటనలు మరుపుకి రావు. పిన్ని లోనూ, మేనత్త లోనూ అమ్మని చూసినా అమ్మ అమ్మే కదా!

చివరి రోజుల్లో అమ్మని చూసుకున్న ఆ వృద్ధాశ్రమానికి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. ఇప్పటికీ నాకు చేతనైన సాయం పెద్దవారికి చేస్తూనే ఉంటాను కానీ నాలోని ఆ లోటు నాతో జీవితాంతం ఉండవలసినదే.


ప్రస్తుత సమాజం ఆలోచన ఎలా ఉంది అంటే వృద్ధాశ్రమంలో ఉన్నవారి అందరి  కొడుకులు- కోడళ్ళు దుర్మార్గులు. ఫేస్ బుక్ లలో వాటిల్లో కూడా ప్రతీ కొడుకు తల్లి తండ్రులని మర్చిపోయి బ్రతుకుతున్నట్టే ఎన్నో పోస్ట్ లు ప్రచారంలో ఉన్నాయి. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు కొందరు పెద్దవారు కూడా పిల్లలతో అడ్జస్ట్ అవ్వలేక ఆశ్రమాలని ఆశ్రయిస్తున్నారు. ప్రతీవారికి వారి స్వతంత్రం ముఖ్యం కానీ అది వేరే వారి స్వతంత్రాన్ని చంపి లాక్కోవలసిన అవసరం లేదు కదా. ఎంతో మంది వేరే దారి లేక ఆశ్రమానికి పంపించి ఉండవచ్చు.  పరిస్థితులను అధికమించలేని సమయంలో మాత్రమే పిల్లలు తల్లి తండ్రులని వృద్ధాశ్రమానికి పంపుతారు. వృద్ధాశ్రమం లోని వారి కొడుకులు అందరూ దుర్మార్గులు, మనసు లేనివారు అనుకోవడం తప్పు. చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని కోట్లు సంపాదించాలని, వేరే దేశంలో ఉంటేనే వాళ్ళకి గౌరవం అని భావించే వారు చాలామంది తమని తామే వృద్దాశ్రమాలకి చేరుకునే బాట వేసుకుంటున్నారు. ఏది ఏమైనా రోజురోజుకీ పెరిగే వృద్ధాశ్రమాల సంఖ్య, వాటిలో చేరే, చేర్చబడే వారి సంఖ్య పెరగడం శోచనీయం. 

ఒక స్నేహితుని అనుభవం, నా అభిప్రాయం తప్ప ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదని మనవి.